ధర్మసాగర్ లో క్వారీలో భారీ పేలుళ్లతో ఎగిరిపడ్డ రాళ్లు..పలువురికి గాయాలు.. రూ. లక్షల్లో ఆస్తినష్టం 

ధర్మసాగర్ లో క్వారీలో భారీ పేలుళ్లతో ఎగిరిపడ్డ రాళ్లు..పలువురికి గాయాలు.. రూ. లక్షల్లో ఆస్తినష్టం 
  • హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లో ఘటన

ధర్మసాగర్, వెలుగు :  క్వారీలో భారీ పేలుళ్ల కారణంగా బండరాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలు, ఆస్తి నష్టం జరిగిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని రిజర్వాయర్ పక్కన ఉన్న క్వారీలో బుధవారం మధ్యాహ్నం బండరాళ్ల కోసం భారీ పేలుళ్లు జరిపారు. దీంతో బండరాళ్లు ఎగిరి పక్కనే ఉన్న  కోళ్లఫామ్ పై పడడంతో అందులో పనిచేస్తున్న పలువురికి గాయాలయ్యాయి.

షెడ్డు రేకులు పగిలి ఏడాదిన్నర బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోళ్లు చనిపోవడంతో పాటు కోడి గుడ్ల కేసులు ధ్వంసమయ్యాయి. దీంతో  రూ. 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఫామ్ యజమాని గాదె రాజేందర్ తెలిపారు. ఈ పేలుళ్లపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

 ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దనే క్వారీ ఉండడంతో ప్రమాదం పొంచి ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు.  క్వారీ ఓనర్లు లింగం నరేందర్ రెడ్డి, లింగం జలేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోళ్ల ఫామ్ యజమాని రాజేందర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.